Friday, April 29, 2011

ఒకే ఒక్కడు * కల్వకుంట్ల చంద్రశేఖరరావు

కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆయన రూటే సెపరేటు. అన్నింటా ఆయన స్థానం ప్రత్యేకమే. వ్యూహరచయితగా ఆయన అంతరంగం ఏమిటన్నది కేసీఆర్‌‌ను అంటిపెట్టుకున్న వారికీ అంతుపట్టని బ్రహ్మరహస్యం. ఎత్తుగడలో ఘనాపాఠీ. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఒక పార్టీ పతనానికి, అదే అధికారంలో ఉన్న మరో పార్టీని అధికారంలోకి రానీయకుండా అడ్డుపడి, ప్రత్యర్థికి చెమటలు పట్టించిన రాజకీయ పోరాటవాది కేసీఆర్‌.

cs-kcr2తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌ అంతరంగం కొన్ని సందర్భాల్లో ఆయనకు అత్యంత సన్నిహితులకు సైతం అందదు. ఏ క్షణాన ఏ నిర్ణయం తీసుకుంటారో దాని బాధ్యత అంతా ఆయనదే. ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జట్టు కట్టినా, కేంద్రంలో మంత్రిగా పని చేసి తర్వాత రాజీనామా చేసినా, కాంగ్రెస్‌ను ఆత్మరక్షణలో పడేయటం కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలందరితో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు కారకుడైనా.. అలాంటి.. ఎలాంటి సంచలన నిర్ణయాలన్నీ ఆయనవే. అసలు కేసీఆరే ఓ సంచలనం. టిఆర్‌ఎస్‌లో వాటిని ప్రశ్నించే వారూ ఉండరు, వ్యతిరేకించేవారు అంతకన్న ఉండరు. తన ఆలోచనలను ఆయన పంచుకుంటారు, అలా పంచుకున్నప్పుడే తన నిర్ణయం సరైనదని అవతలివారు అనుకునేలా ఒప్పిస్తారు. ఇదీ కెసిఆర్‌ దగ్గర ఉన్న మెళకువ. రాజకీయ చతురత. ఇతరులను ఒప్పించి, మెప్పించడం ఓ కళ. ఆ కళలో కేసీఆర్‌ నిష్ణాతుడు. మహాకూటమిని సమర్థించి అందులో చేరినా, ఆ తర్వాత అదే కూటమిని తూర్పాపట్టినా, గత ఎన్నికల్లో అదే టీడీపీని ఓడించేందుకు కాంగ్రెస్‌తో చేతులు కలిపినా.. అందుకు ఓ లాజిక్కు చెబుతారు. ఆ తత్వం అందరికీ నిజమేననిపిస్తుంది. దటీజ్‌ కేసీఆర్‌!

ఒక సమస్యను ఎంచుకుంటే దానిపై అవిశ్రాంతంగా పోరాడటం, అంకిత భావంతో శ్రేణులతో పని చేయించటం ఆయనకు కొత్త కాదు. కొన్ని నిర్ణయాలు బెడిసికొట్టినా, పరిస్థితిని మళ్ళీ తన అదుపులోకి తెచ్చుకోవటం కెసిఆర్‌కు తెలిసినంతగా రాష్ట్ర రాజకీయ నేతలలో చాలామందికి తెలియదు. దివంగత సీఎం వైఎస్‌ దెబ్బకు తన పార్టీ చీలి, దాని ఫలితంగా వచ్చిన ఉప ఎన్నికల్లో ఊహించని పరాజయం ఎదురైనా, మళ్లీ నిలదొక్కుకుని పార్టీని నిలబెట్టిందీ ఆయనే. అలాంటి మరొక ఉప ఎన్నికల్లోనే తన పార్టీ అభ్యర్ధులను రాష్ట్ర ఎన్నికల చరిత్రలోనే ఎవరికీ దక్కనంత మెజారిటీలు సాధించిపెట్టిన ఘనత నిస్సందేహంగా కల్వకుంట్లదే.

కేసీఆర్‌ రాజకీయ ప్రస్థానం
cs-kcr1వెనుకబడిన మెదక్‌ జిల్లా చింతమడక గ్రామంలో 1954 ఫిబ్రవరి 17న జన్మించిన కెసిఆర్‌, తెలుగు సాహిత్యంలో ఎంఎ పట్టా అందుకున్నారు. 1982లో రాఘవాపూర్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పిఎసిఎస్‌) అధ్యక్షుడుగా ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. అదే సంవత్సరం రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడుగా పని చేశారు. 1985లో తొలిసారి సిద్దిపేట నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికైన కెసిఆర్‌, ఆరు పర్యాయాలు అక్కడ ప్రాతినిధ్యం వహించారు. 2001-02లో తెలుగుదేశం పార్టీకి, డిప్యూటీ స్పీకర్‌ పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించి సిద్దిపేట నుంచే 58,000 వోట్ల మెజారిటీతో అఖండ విజయం నమోదు చేశారు. 2004లో కరీంనగర్‌ లోక్‌సభ స్థానానికి ఎన్నికయ్యారు. 2006లో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి, యుపిఎ కూటమికి మద్దతు ఉపసంహరించి ఉప ఎన్నికల బరిలో దిగి రెండు లక్షల వోట్లకు పైగా భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. గత ఏడాది ఎమ్మెల్యేలతో పాటు తాను, మరో ఎంపీ వినోద్‌ కుమార్‌ రాజీనామా చేసి మరోసారి లోక్‌సభలో అడుగు పెట్టారు. ఎన్టీఆర్‌ మంత్రి వర్గంలో కరవు నివారణ మంత్రిగా, చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా, యుపిఎ కూటమిలో కేంద్ర కార్మిక మంత్రిగా పని చేశారు. తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడుగా, జిల్లా పార్టీ అధ్యక్షుడుగా, రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించారు.

ఆయన ప్రసంగం గంగాఝరి...
కెసిఆర్‌ ఏ సభ నిర్వహించినా అది విజయవంతం కావటం పరిపాటి. సభలకు వచ్చే జనం ఒక్క కెసిఆర్‌ ప్రసంగం వింటే చాలునన్న ఆశతో ఎక్కడెక్కడినుంచో తరంగాల్లా తరలి వస్తారు. ఆయన ప్రసంగం గంగా ప్రవాహంలా సాగిందనేందుకు జనప్రవాహం చేసే కరతాళ ధ్వనులే తార్కాణం. సాధారణంగా రాజకీయ వేత్తలు కళ్ళ ముందు భారీ జన సందోహం కనిపిస్తే చాలు...శివమెత్తినట్టు ఊగిపోతూ ప్రసంగాలు సాగిస్తుంటారు. కెసిఆర్‌ అందుకు పూర్తి భిన్నం. విషయం ఎంత పెద్దదైనా, సూటిగా, స్పష్టంగా, నిర్దిష్ట కాల పరిమితి నిర్ణయించుకుని ముగించేస్తారు. ఎక్కడికక్కడి స్థానిక సమస్యలు ఆయన ప్రసంగాల్లో ప్రధాన అంశాలుగా ఉంటాయి. శత్రు పక్షాలను వాగ్ధాటితో దునుమాడే సమయంలోనూ ఆయన పెదవులు సంయమనం కోల్పోవు. అప్పుడప్పుడు చవటలు, సన్నాసులు, దద్దమ్మలు లాంటి ఉపమానాలు వాడినా దానికి సంబంధించి ఎదురయ్యే విమర్శలను తిప్పికొట్టగల సత్తా కూడా కెసిఆర్‌కు ఉంది. పిట్టకథలు, శబ్ద చమత్కారాలతో సాగే ప్రసంగాలు జనాన్ని అప్పుడే ముగిసిందా అనిపించేలా చేస్తాయి.



సాహిత్య పిపాసి
cs-kcr4 సాహిత్యంలో ఎంఎ పట్టా పుచ్చుకున్న కెసిఆర్‌, ఎంత పని ఒత్తిడిలో అయినా రోజుకు కనీసం రెండు, మూడు పుస్తకాలు చదవకుండా ఉండరని ఆయన సన్నిహితులు చెబుతారు. ప్రముఖ కవి నందిని సిధారెడ్డి సహాధ్యాయి అయిన ఆయన ఏ అంశం అయినా కూలంకషంగా అధ్యయనం చేయనిదే మాట్లాడరు. ఆయన ఉపన్యాసాల్లో అయినా, మామూలుగా మాట్లాడేటప్పుడైనా దొర్లే సూక్తులు, సామెతలు అన్నీ ఆయన పఠనానుశీలత నుంచి జాలువారినవే. తెలంగాణ ప్రాంతంపై ఇతరులెవరైనా వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తే, ఆంధ్ర ప్రాంత మహాకవి శ్రీనాథుడి పద్యాలే కెసిఆర్‌ జవాబులకు ములుగర్రలు. పల్నాడు వెనుకబాటు తనాన్ని శ్రీనాథుడెలా వర్ణించిందీ కెసిఆర్‌ ప్రతిపదార్థ తాత్పర్యంతో విడమరచి చెబుతారు.పార్టీని స్థాపించే ముందు తెలంగాణ చరిత్రను కూలంకషంగా అధ్యయనం చేశారు. తెలియని విషయాలను నిపుణులతో చర్చించి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్ర జలసంఘంలో పని చేసిన ఆర్‌. విద్యా సాగరరావు, ఇతర నిపుణులతో నిరంతరం చర్చలు జరిపి విషయావగాహన పెంచుకున్నారు. అందుకే అంత సాధికారికంగా ఆయన ప్రసంగాలుంటాయి. తెలంగాణ చారిత్రక సంస్కృతీ విశేషాలు, పండుగలు, పబ్బాలు ఇలా దేన్నీ విడవకుండా లోతుగా తెలుసుకోవటం కెసిఆర్‌కు ఉన్న మంచి అలవాటు అని ఆయన ప్రత్యర్థులు సైతం అంగీకరిస్తారు. ఎన్నికలు వచ్చే సమయాల్లో కెసిఆర్‌ పార్టీ నిర్మాణంలో మునిగిపోతారు. ఎన్నికల్లో పొత్తులు అనివార్యమని అందరికీ తెలిసినా ఎవరితో జట్టు కడతారో సహచరులు చివరి క్షణం వరకూ చెప్పలేరు. తాను చేసింది, తీసుకున్నదీ తప్పని తేలినా దానిని సైతం ఒప్పని వాదించే నేర్పు-ఓర్పు కేసీఆర్‌ సొంతం.

గులాబీ కారు - మహా జోరు
* 27-01-2001
 డిప్యుటీ స్పీకర్‌, ఎమ్మెల్యే, టీడీపీ సభ్యత్వానికి కేసీఆర్‌ రాజీనామా
 అదేరోజు హైదరాబాద్‌లో నిర్వహించిన జలదృశ్యంలో ‘టీఆర్‌ఎస్‌’ పార్టీ ప్రకటన
 12,15,17-07 జిల్లా పరిషత్‌, మండల్‌ పరిషత్‌ ఎన్నికల్లో పోటీ
 100ఎంపీటీసీలు,2 జెడ్పీటీసీలు, 2జెడ్పీలు కైవసం
* 16-08-2001లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ, 3వేల సర్పంచులు, 12వేల వార్డులు గెలుపు
 
* 18-08-2001లో రాజకీయ పార్టీగా ఆవిర్భావం
* 22-09-2001 సిద్దిపేట ఉప ఎన్నికల్లో కేసీఆర్‌ ఘనవిజయం
 
* 22-05-2002లో భూధాన్‌ పోచంపల్లిలో చేనేత కార్మికుల కోసం కేసీఆర్‌ బిక్షాటన
 * 11-08-2002లో  టీఆర్‌ఎస్‌లో తెలంగాణ సాధన సమితి విలీనం
 * 07-10- పల్లెబాట ప్రారంభం
 * 06-01-2003లో జలసాధన కార్యక్రమం, సామూహిక నిరాహార దీక్షలు, విద్యాసంస్థల
         బహిష్కరణ, రాస్తారోకోలు, మహిళా శక్తి ప్రదర్శన
 * 27-03న ఢిల్లీకి కారు ర్యాలీ
* 27-04 వరంగల్‌లో వరంగల్‌ జైత్రయాత్ర బహిరంగ సభ ( మాజీ ప్రధాని దేవగౌడ,
       అజత్‌సింగ్‌ రాక)
 
*  11-06-2003 జగ్జీవన్‌రామ్‌ విగ్రహం వద్ద 610జీఓపై కేసీఆర్‌ ధర్నా
 09-09-2003న జాతీయ చిన్న రాష్ట్రాల కూటమి కన్వీనర్‌గా కేసీఆర్‌ ఎన్నిక

*  2004 ఏప్రిల్‌లో కాంగ్రెస్‌తో పొత్తు, 26 అసెంబ్లీ స్థానాలు, 5 పార్లమెంటు స్థానాలు కైవసం
 21-05-2004లో రాజకీయ పార్టీగా గుర్తింపు
 26-05-2004 యూపీఏ-1లో కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రామ్‌లో తెలంగాణ అంశం, 
       రాష్ట్ర పతి ప్రసంగంలో తెలంగాణ అంశం ప్రస్థావించటంలో  కేసీఆర్‌ విజయం

*  08-01-2005 తెలంగాణపై ప్రణబ్‌ ముఖర్జీ నేతృత్వంలో త్రీమెన్‌ కమిటీ ఏర్పాటు
 08-07-2005 వైఎస్‌ మంత్రివర్గంనుండి ఆరుగురు టీఆర్‌ఎస్‌ మినిష్టర్లు రాజీనామా
 17-07-2005లో వరంగల్‌లో యూపీఏ ప్రభుత్వ ప్రధాన భాగస్వామి శరద్‌ పవార్‌తో 
        బహిరంగ సభ
 17-10-2005లో పార్టీ నుండి ఎమ్మెల్యే సంతోష్‌రెడ్డి బహిష్కరణ
 11-11-2005న తిరిగి పార్టీలోకి సంతోష్‌రెడ్డి. 
 13-11-2005న 11 ప్రశ్నలతో 8 మంది టీఆర్‌ఎస్‌ అసమ్మతి ఎమ్మెల్యేల బహిరంగ లేఖ
 28-11-2005 టీఆర్‌ఎస్‌ తిరుగుబాటు ఎమ్మెల్యేలు తూర్పు జయప్రకాశ్‌రెడ్డి, బండారు 
        శారారాణి, దుగ్యాల శ్రీనివాస్‌రావులను పార్టీ నుండి బహిష్కరణ
 మే 2005లో స్థానిక సంస్థల ఎన్నికల్లో  మళ్లీ కాంగ్రెస్‌తో పొత్తు, 25 జెడ్పీటీసి 
        స్థానాలు కైవసం
 
* 14-08-2006 తెలంగాణ భవన్‌ ప్రారంభోత్సవ వేడుక
 23-08-2006న కేసీఆర్‌, నరెంద్ర యూపీఏ కేబినెట్‌కు రాజీనామా, సీఎంపీలో పేర్కొన్నట్లు 
        తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద నిరాహార దీక్ష
 12-09-2006 కరీంనగర్‌ పార్లమెంట్‌ స్థానానికి కేసీఆర్‌ రాజీనామా, యూపీఏకు మద్దతు 
        ఉపసంహరణ
 17-12-2006న కరీనగర్‌ ఉప ఎన్నికల్లో  2లక్షల1582 ఓట్లతో  కేసీఆర్‌ గెలుపు
 22-12-2006 నల్గొండలో ‘తెలంగాణ ఆత్మగౌరవ సభ’
 
* 22-03-2007 శాసన సభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా హెచ్‌ ఏ రెహమాన్‌ ఎన్నిక
 25-03-2007అసెంబ్లీ గ్రాడ్యుయేట్‌ స్థానాల నుండి కే.దిలీప్‌కుమార్‌, ఆర్‌.
       సత్యనారాయణ గెలుపు

* 3-3-2008 కేసీఆర్‌తో సహా ముగ్గురు ఎంపీల రాజీనామా
 4-03-2008 16 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు అసెంబ్లీ, కౌన్సిల్‌కు రాజీనామా
 1-6-2008 ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 2 ఎంపీ స్థానాలు( కరీంనగర్‌, హన్మకొండ) 7 
        ఎమ్మెల్యే స్థానాలు, టీడీపీ నాలుగు ఎమ్మెల్యే , 1 ఎంపీ స్థానం, కాంగ్రెస్‌ 5 ఎమ్మెల్యే, 
        1 ఎంపీ స్థానం కైవసం చేసుకున్నాయి. 
 
* 21-12-2009న ఆరుగురు అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామా 
 29-11-2009న 14 ఎఫ్‌పై కరీంనగర్‌లో నిరాహారదీక్షకు బయలు దేరిన కేసీఆర్‌ను 
        అలుగనూర్‌ వద్ద అరెస్టు చేసిన గ్రేహౌండ్‌ పోలీసులు. ఖమ్మం  జైల్లోనే దీక్ష 
         ప్రారంభించిన కేసీఆర్‌ 
 1-12-2009  ఉద్యమం ఉదృతం
 09-12-2009న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి 
       చిదంబరం ప్రకటన
 23-12-2009 తెలంగాణ ఏర్పాటుపై రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల విస్తృత అభిప్రాయ 
       సేకరణ కోసం ప్రయత్నిస్తున్నట్లు ప్రకటన
 అదే రోజు 569 మందితో తెలంగాణ జేఏసీ ఏర్పాటు 

*  03-02-2010న జస్టిస్‌ శ్రీకృష్ణ  నేతృత్వంలో 5 సభ్యులతో కమిటీ ఏర్పాటు

సేనానిలా..
టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఎవరి మాట వింటారు? ఎవరితో తన ఆలోచనలు పంచుకుంటారు? ఎవరి మాటకు ఎక్కువ విలువ ఇస్తారు?.. ఇలాంటి ప్రశ్నలు, సందేహాలు పార్టీ శ్రేణుల్లో వినిపిస్తుంటారుు. నిజానికి ేకసీఆర్‌ ఎవరి సలహాలు పాటించకపోరుునా, అందరి అభిప్రాయాలూ వింటారు. అందులో తనకు నచ్చనవి కొట్టిపారేస్తారు. తన అభిప్రాయాలనే బలపరిచేలా వ్యవహరిస్తుంటారు. కేసీఆర్‌‌కు అత్యంత సాన్నిహిత్యంగా వ్యవహరించే కొందరు నేతలు, వారి ప్రత్యేకతలు ఇవీ...

ప్రొఫెసర్‌ జయశంకర్‌
jayashankarకేసీఆర్‌ సహా అంతా ఈయనను గురుతుల్యుడుగా భావిస్తుంటారు. కీలకమైన అంశాల్లో కేసీఆర్‌ ఈయనతో చర్చిస్తుంటారు. టీఆర్‌ఎస్‌ సిద్ధాంతకర్త అన్న పేరు ఉన్నప్పటికీ అసలు సిసలు సిద్ధాంతకర్త కేసీఆరే. మొదటి నుంచీ మీడియాలో ఆవిధంగా ప్రచారంలోకి రావడంతో ఇప్పటికీ అదే భావన కొనసాగుతోంది. ప్రైవేటు సంభాషణలో మాత్రం జయశంకర్‌ను సిద్ధాంతకర్తగా కేసీఆర్‌ అంగీకరించరన్నది నేతల మాట. కానీ, కేసీఆర్‌కు నచ్చచెప్పగల స్థాయి, చొరవ జయశంకర్‌కు ఉంది. కేసీఆర్‌ తర్వాత స్థాయి నాయకులు మాత్రం జయశంకర్‌కు అత్యంత గౌరవం ఇస్తారు.

కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు
laxmikanthకేసీఆర్‌ మనస్ఫూర్తిగా విశ్వసించే అతికొద్ది మంది నేతల్లో కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు ఒకరు. కేసీఆర్‌ వరంగల్‌కు వెళితే కెప్టెన్‌ సాబ్‌ ఇంట్లోనే తిండి, బస. టీఆర్‌ఎస్‌.. కాంగ్రెస్‌ సర్కారులో చేరినప్పుడు కెప్టెన్‌కు మంత్రి పదవి ఇప్పించారు. ఆయన కేసీఆర్‌ ఆదేశాలను జవదాటరు. ఒకరకంగా పార్టీకి మూలస్తంభం. ఆర్ధిక వ్యవహారాల్లో పార్టీకి దన్నుగా ఉంటారు. ఆర్థికపరమైన అంశాలన్నీ కెప్టెనే భుజాన వేసుకుంటారు. వివాదరహిత ముద్ర.

వినోద్‌కుమార్‌
కేసీఆర్‌కు బంధువు. నమ్మకస్తుడు. ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో జరిగే అధికార, అనధికార సమావేశాలకు పార్టీ ప్రతినిధిగా ఆయనే వెళుతుంటారు. సంక్షోభ సమయాల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తుంటారు. మిగిలిన నేతలతో పోలిస్తే కేసీఆర్‌తో చనువు ఎక్కువ. కేసీఆర్‌ నిర్ణయాలను బలపచడంలో ముందుంటారు.

హరీష్‌రావు
harisharaoకేసీఆర్‌ మేనల్లుడిగా తెరపైకి వచ్చినప్పటికీ ఆ తర్వాత తన సత్తా ఏమిటో నిరూపించుకున్న యువ నేత. ఒక్కమాటలో చెప్పాలంటే.. సిద్దిపేటలో ఇప్పుడు కేసీఆర్‌ కన్నా ఎక్కువ ఇమేజ్‌ ఉన్న నేతగా అవతరించారు. ప్రజలు, పార్టీ శ్రేణులతో మమేకం అయ్యే నేత. యువతలో హరీష్‌కు మంచి పట్టు ఉంది. క్షేత్రస్థాయిలో యువత, శ్రేణులను సమీకరించి, ప్రత్యర్థులకు చెమటలు పట్టించగలిగే స్థాయి ఉన్న వ్యూహరచయిత. కేసీఆర్‌తో వాదించే శక్తి ఉన్న నేత. పార్టీలో తనకంటూ ప్రత్యేక వర్గం ఉన్న ఏకైక నేత ఆయనొక్కరే. కేసీఆర్‌ తీసుకునే కీలక నిర్ణయాల్లో ప్రధాన పాత్రధారి. హరీష్‌ ఆమోదం లేకుండా నిర్ణయాలు తీసుకోవడం దుర్లభం. హరీష్‌కు అసంతృప్తి రాకుండా కేసీఆర్‌ సైతం జాగ్రత్త పడుతుంటారు. ఆయన వర్గానికి సరైన ప్రాధాన్యం ఇస్తుంటారు.

కేటీఆర్‌ : తండ్రి చాటు కొడుకుగా రాజకీయ తెరంగేట్రం చేసినా, ఆ తర్వాత తానేమిటో నిరూపించుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన కాలంలో ప్రజలు, పార్టీ శ్రేణులకు చేరువయ్యారు. క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తల మనోభావాలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేశారు. ముక్కుసూటిగా మాట్లాడే నైజం. తండ్రి మాదిరిగానే అనర్గళంగా మాట్లాడే నేతగా పేరొందారు. కష్టపడి పనిచేసి మంచి వ్యూహకర్త అన్న ప్రశంసలు పొందారు.

హరీష్‌ మాదిరిగానే నిరంతరం ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండే యువనేతగా పేరు తెచ్చుకున్నారు. తండ్రికి అన్ని అంశాల్లో బాసటగా నిలుస్తున్నారు. అయితే, కొన్ని కీలక అంశాల్లో తండ్రి నిర్ణయాలు నచ్చకపోతే దానిని వ్యతిరేకించే స్వభావం ఉన్న నేత. పార్టీలో తనకంటూ ఒక వర్గం ఏర్పాటు చేసుకున్నారు. యువతలో హరీష్‌ స్థాయిలో గుర్తింపు సాధించారు. పార్టీ నిర్ణయాల్లో కీలక శక్తి.

నాయని నర్శింహారెడ్డి
nainiకేసీఆర్‌కు అత్యంత నమ్మకస్తులైన నేతల్లో ఈయనొకరు. ఆయనకు నచ్చచెప్పగలిగే కొద్దిమంది నేతలో నాయని ఒకరు. ‘నర్సన్నా’ అని ఆప్యాయంగా పిలిచే కేసీఆర్‌కు ఆయనపై ఎనలేని నమ్మకం. అందుకే పార్టీ వ్యవస్థాపక దినోత్సవం రోజు మినహా.. మిగిలిన అన్ని సందర్భాల్లో నాయని తోనే పార్టీ జెండా ఎగురవేయిస్తుం టారు.

ఈటెల రాజేందర్‌ :
పార్టీ శాసనసభాపక్ష నేత అయిన ఈ బీసీ నాయకుడిపై కేసీఆర్‌కు ఎనలేని విశ్వాసం. అనేక అంశాల్లో కేసీఆర్‌-మిగిలిన వారికి అనుసంధానకర్త. కేసీఆర్‌కు పూర్తి విధేయుడు.

కర్నె ప్రభాకర్‌ 

 కేసీఆర్‌కు అత్యంత విశ్వసనీయుడైన నేత. పార్టీ కార్యక్రమాలు చురుకుగా నిర్వహించడం తో పాటు, పార్టీకి సంబంధించిన తెరవెనుక వ్యవహారాల్లో నిష్ణాతుడు. ఉద్యమాల సమయంలో విద్యార్ధులతో సమన్వయం నెరిపే నేత.


Padma-rao-Trs,-Mla
పద్మారావు
కేసీఆర్‌కు విధేయుడు. పార్టీ నిర్వహించే బహిరంగసభల నిర్వహణ, పర్యవేక్షణలో ముందుంటారు. అధినేతకు ఆంతరంగికుడు. పార్టీ సంక్షోభ సమయంలో అధినేత తరఫున రాయబారిగా వ్యవహరించి, అసంతృప్త నేతలతో చర్చిస్తుంటారు.

జగదీశ్వర్‌రెడ్డి
jagadeshwarఅధినేతకు విధేయుడు. పార్టీ విధానాన్ని గట్టిగా వినిపించే నేత. కేసీఆర్‌ సైతం ఆయనను విశ్వసిస్తుంటారు. పార్టీ వాణిని చానెళ్ల ద్వారా సమర్ధవంతంగా వినిపించడంతో పాటు, ప్రత్యర్థుల విమర్శలను అంతే సమర్థవంతంగా తిప్పికొట్టగల నేత.


మధుసూదనాచారి

కేసీఆర్‌కు అత్యంత విశ్వసనీయుడు. పార్టీ వ్యవస్థాపక సభ్యుడు. కేసీఆర్‌ నివాసం, కార్యాలయంలోనే ఎక్కువ సేపు గడిపి, కార్యకర్తలకు అందుబాటులో ఉండే నేత.


నాన్న బాటలో...
ktrరాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే ప్రముఖుల కుటుంబాలకు చెందిన వ్యక్తులు రాణిస్తున్న సంఘటనలు స్వల్పమే. తండ్రి సీఎం అయితే కొడుకులు ఆ స్థాయిలో రాణించిన సందర్భాలు లేవు. కానీ.. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కుటుంబం మాత్రం దీనికి పూర్తి భిన్నం. మొదట అందరి మాదిరిగా కేసీఆర్‌ కొడుకు, కూతురుగానే రాజకీయాల్లో కాలుపెట్టినప్పటికీ.. ఆ తర్వాత ఆ హోదాతోనే గుర్తింపు తెచ్చుకోకుండా.. స్వంత ప్రతిభతో రాణిస్తున్న కేటీఆర్‌, కవిత ఇప్పుడు స్వతంత్ర హోదాతో గుర్తింపు పొందుతున్నారు. ఇద్దరూ విదేశాల్లోనే చదివి, అక్కడే ఉద్యోగాలు చేసి వచ్చినప్పటికీ ఇక్కడి జనాల అంతరంగం, భాష, సంస్కృతితో మమేకమయిన కేటీఆర్‌, కవిత తెలంగాణ ప్రజానీకంలో తమకంటూ స్వంత ఒరవడి, గుర్తింపు సృష్టించుకున్నారు. తండ్రి మాదిరిగానే పుస్తకాలు చదివి విషయజ్ఞానం పెంచుకున్నారు.

కేసీఆర్‌ మాదిరిగానే ఇద్దరూ అనర్గళంగా, వ్యూహాత్మకంగా మాట్లాడే స్థాయికి, ఏ సమయంలో ఎంతవరకూ మాట్లాడాలో, ఏది మాట్లాడితే మీడియాను ఆకర్షిస్తుందో బాగా వంటబట్టించుకున్నారు. సాధారణ నాయకుల మాదిరిగానే రోడ్లపైకి వచ్చి జనంతో కలసి నినదిస్తు తామూ ప్రజానేతలమేనని కార్యాచరణతో నిరూపించుకున్నారు. సినిమాలో హీరోల కుమారులు హీరోలుగా తెరంగేట్రం చేసినప్పటికీ.. వారిని ప్రేక్షకులు గుర్తించకపోతే రాణించరు. తండ్రుల హీరోయిజం, గ్లామర్‌, పేరు ప్రతిష్ఠలు వారిని కాపడలేవు. రాజకీయాల్లో కూడా అంతే. ఒక స్థాయి వరకూ అధినేతల కుటుంబసభ్యులుగా తొలి హోదా సంపాదించుకున్నప్పటికీ, ప్రజల మధ్యకు వెళ్లకుండా, నేతలుగా గుర్తింపు సాధించలేక వెనుకబడిన వారు రాష్ట్ర రాజకీయాల్లో కోకొల్లలు. కానీ, కేసీఆర్‌ కుమారుడు తారకరామారావు, కూతురు కవిత మాత్రం తండ్రి ద్వారా తమకు వచ్చిన హోదాను వినియోగించుకుని జనామోదంతో అగ్రనేతలుగా ఎదుగుతున్నారు.

kavitha అచ్చ తెలంగాణ యాసతో ఇద్దరూ తెలంగాణ ప్రజలకు చేరువయ్యారు. అధినేత వారసులుగా ఉన్నప్పటికీ, ఆ ముద్రకే పరిమితం కాకుండా కష్టపడి ప్రజల్లోకి వెళ్లి, ఉద్యమాల ద్వారా గుర్తింపు సాధించారు. కేటీఆర్‌ తన తొలి ఎన్నికలో సిరిసిల్లలో అత్తెసరు మెజారిటీతో గెలిచినప్పటికీ, పట్టువిదలని విక్రమార్కుడిలా పనిచేసి రెండోసారి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ప్రతి ఆందోళన కార్యక్రమాల్లోనూ ముందుండి వాటిని నడిపిస్తు న్నారు. అటు కవిత సైతం ఉద్యమ సమయంలో అందరికంటే ఎక్కువ మార్కులు సంపాదించుకు న్నారు. బతుకమ్మ పండుగ శతాబ్దాల నుంచి ఉన్నప్ప టికీ.. కేవలం కవిత ద్వారానే దానికి ప్రపంచస్థాయి గుర్తింపు లభించింది. ఆ పండుగ ప్రాశస్త్యం వివరించేందుకు ఆమె గల్లీ నుంచి ఢిల్లీ వరకూ కార్యక్రమాలు చేపట్టారు. మహిళలను మమేకం చేసి, ఆ పండుగ ప్రత్యేకతను స్కూళ్ల వరకూ విస్తరింప చేశారు. తెలంగాణ సంస్కృతి, సాహిత్యం, జీవన విధానంపై పుస్తకాలు సైతం ముద్రించడం, తెలంగాణ సంస్కృతిని ఈ తరాలు మర్చిపో కుండా ఉండేందుకు జిల్లాల్లో పర్యటనలు నిర్వహించడం వంటి కార్యక్రమాలతో కవిత తానేమిటో నిరూపించుకున్నారు. రానున్న ఎన్నికల్లో పార్లమెంటుకు పోటీ చేసే స్థాయికి ఎదిగారు.

తెలంగాణ సాధిస్తాం : ఈటెల
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతోపాటు పునర్‌ నిర్మాణం చేసుకోవడం టిఆర్‌ఎస్‌ లక్ష్యమని టిఆర్‌ఎస్‌ శాసన సభ పక్షనేత ఈటెల రాజేందర్‌ పేర్కొన్నారు. పార్టీ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మేజర్‌న్యూస్‌తో మనసు విప్పి మాట్లాడారు. కాషాయం నుండి పచ్చ జెండా వరకు అన్ని వర్గాలు తెలంగాణ ఎజెండానే ప్రధానంగా తీసుకుని ముందుకు సాగే విధంగా 10 సంవత్సరాల ఉద్యమం దోహదపడిందని పేర్కొన్నారు.

జూన్‌లోగా కేంద్రం తెలంగాణ ఇస్తుందని అంటున్నారుమీరు విశ్వసి స్తారా ?
ఈటెల : ఉద్యమ కారులు ఆశావాదులు ఇన్నాళ్ళుగా చరిత్రను చూస్తే పలు దఫాలు కేంద్రం మోసం చేసింది. ఐనప్పటికీ వేచి చూస్తున్నాం. మళ్ళీ ఉద్యమం ఉధృతం చేసి వచ్చే వరకూ పోరాడుతాం.

దళితున్ని సిఎం చేస్తారని ప్రకటించారు. కట్టుబడి ఉన్నారా !

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత దళితుడు మొదటి ముఖ్యమంత్రి అవడం ఖాయం. ప్రకటించిన ఆనాటి నుండి ఏ నాటి వరకు అయినా తమ సిద్ధాంతం మారదు.

మిలియన్‌ మార్చ్‌ విధ్వంసం వెనుక ఎవరున్నారని భావిస్తున్నారు
అగో ఇగో అంటూ మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరుతో విసిగి వేసారి పోయి కడుపు మండిన ఉద్యమకారులు ఆవేదనతో చేసిన పని.
టిఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని ప్రచారంలో ఉంది.
తెలంగాణ వచ్చిన తరువాతనే విలీనం సంగతి ముందుకు వస్తుంది. ముందుగా ప్రత్యేక రాష్ట్రం సాధించుకుందాం. ఆ తరువాత శిథిలమైన మన ప్రాంతాన్ని మనం పునర్‌నిర్మించుకుందాం.

హైదరాబాద్‌లో పార్టీ పరిస్థితి
etela ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆసిఫాబాద్‌ నుండి హైదరాబాద్‌ వరకు ప్రతి ఒక్కరి హృదయాల్లో తెలంగాణ వాదం నాటుకుపోయింది. పట్టణాలు పల్లెలు అంటూ ఎక్కడా వ్యత్యాసం లేదు. దుబాయిలో ఉన్నా, అమెరికాలో ఉన్నా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం టిఆర్‌ఎస్‌ ద్వారానే సిద్ధిస్తుందని భావిస్తున్నారు. పార్టీ సైతం ఏకైక ఎజెండాతో ముందుకు సాగుతోంది.

పార్టీపటిష్టత కోసం ఏ విధంగా పావులు కదుపుతారు.
కొన్ని జిల్లాల్లో ఎన్నికలు జరిగిన సమయంలో ఉన్న వాతావరణం నేడు లేదు. ఇక్కడ బలం, బలహీనతలు, నాయకులు లేరు. కార్యకర్తలు రారు అనేది అసలే కాదు. ఒక అంశం మీద ఆధారపడి పని చేస్తున్న దేశంలోనే ఏకైక ఉద్యమ పార్టీ. పటిష్టత అనేది నిరంతరం కొనసాగుతుంది. అది పార్టీ అంతర్గత విషయం.
ఎమ్మెల్యేలు అభివృద్దిపై దృష్టిసారించడం లేదని ఆరోపణలున్నాయి
తెలంగాణ ఉద్యమం వల్లె ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల అభివృద్ధికోసం ప్రభుత్వంతో కోట్లాడి నిధులు తెస్తున్నారు. పాలకులు అభివృద్ధి విషయంలో తెలంగాణ విషయంపై వివక్ష చూపిస్తున్నారు. అభివృద్ధిపై టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దృష్టి పెట్టలేదనేది వాస్తవం కాదు.

పక్కదారి పడుతున్న వారి విషయం
ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేస్తూ ముందుండి నడిపిస్తున్న వారిని సమైఖ్య వాదులు ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లేలా చేస్తున్నారు. అది కుట్రలో భాగమే పలు సందర్భాల్లో పార్టీ కఠినంగా వ్యవహరించింది. ద్రోహం చేసిన వారికి ప్రజలే గుణపాఠం చెపుతారు. అలాంటి వారికి భవిష్యత్తు ఉండదు.

cs-kcr