Saturday, March 31, 2012

శ్రీ రాముడు...మా రాముడు..నేను

ముప్పైఏళ్లక్రితం ఆయనొక మొక్కు మొక్కుకున్నాడు. తన స్నేహితుడు సమితి ప్రెసిడెంటుగా గెలిస్తే భద్రాచలం రామాలయానికి వెళ్లి తలనీలాలిస్తానని. భద్రాద్రిరాముడు ఆయన కోరిక తీర్చాడు. వెంటనే ఆ భక్తుడు తన మొక్కు తీర్చుకున్నాడు. అక్కడితో రాముని బాకీ తీరిపోయిందని అనుకున్నాడు. కాని తారకరామునికి భద్రాద్రి రామునికి మధ్య తానొక వారిధిగా పనిచేసి మరిన్ని మొక్కులు చెల్లించాల్సి ఉంటుందని ఊహించలేదాయన. ఎనిమిదేళ్లు మంత్రిగా పనిచేసిన ఆయన భద్రాచలాన్ని తన సొంతూరిలా చూసుకున్నారు. ఆయనే తెలుగుదేశం నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు. ఆయన ఊరి విశేషాలే ఈ 'మా ఊరు'.
"యాభైఏళ్లనాడు మా ఊరి ప్రజలు భద్రాచలానికి నడుచుకుంటూనే వెళ్లేవారు. బాగా డబ్బున్నవాళ్లయితే ఎడ్లబండ్లమీద వెళ్లేవారు. అడవి మార్గాన అడ్డదారిలో వెళితే రామాలయం మా ఊరికి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉండేది. మా ఊరివాళ్లకు రాముడు ఎప్పుడు గుర్తుకువస్తే అప్పుడు కాలినడకనే భద్రాచలం వెళ్లిపోయేవారు. మా ఊరి పేరు చెప్పినా, శ్రీరాముడి పేరు చెప్పినా మా ఊరునుంచి మోటార్‌సైకిల్‌పై వెళ్లి స్వామివారికి చెల్లించుకున్న మొక్కు గుర్తుకువస్తుంది నాకు. నాకప్పటికి పాతికేళ్లు ఉంటాయేమో... నేను యూత్ రాజకీయాల్లో ఉన్నరోజులవి. నా స్నేహితుడ్ని సమితి ప్రెసిడెంటుగా నిలబెట్టాను. వాడు గెలిచి మా టీం పరువు నిలబెడితే రాముడికి తలనీలాలు ఇస్తానని మొక్కుకున్నాను. నేను కోరుకున్నట్టే జరిగింది.

ఎన్నికల ఫలితాలు తెలియగానే మోటర్‌సైకిల్ తీసుకుని భద్రాచలానికి ఒక్కడ్నే బయలుదేరిపోయాను. ఊరు దాటి, సగం దూరం వెళ్లాక కిన్నెరసాని నదిలోనుంచి వెళ్లాల్సి వచ్చింది. నదిపైన లోలెవల్ బ్రిడ్జి ఒకటి ఉండేది. దానిపైన ఎప్పుడూ మోకాలి ఎత్తు నీరు వెళుతూ ఉండేది. నీటి ప్రవాహం మెల్లగానే ఉంది కదా...మోటర్‌సైకిల్‌పై వెళ్లిపోవచ్చని బండిని వంతెనపై నడిపించుకుంటూ వెళ్లాను. సగం దూరం వెళ్లగానే కిన్నెరసాని నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోయింది. అంతా సెకన్లలోనే జరిగిపోయింది. నీటి తాకిడికి బండి ముందుకు కాకుండా పక్కకు వెళ్లిపోతోంది. ఒక్క రెండు అడుగులు పక్కకు జరిగితే వాగులో పడిపోతాను.

ఒక్క నిమిషం గుండె ఆగిపోయినట్టు అనిపించింది. ఒంట్లో ఉన్న బలాన్నంతా కూడదీసుకుని బండితో నీళ్లకు ఎదురు నడిచాను. అప్పటికి నీటి ఉధృతి కొద్దిగా తగ్గింది. బతుకు జీవుడా అంటూ గట్టుకు చేరుకున్నాను. 'నీ దర్శనం కోసం బయలుదేరితే ఏకంగా నీ దగ్గరికే తీసుకుని వెళ్లిపోతావా స్వామీ...ఇక ఏ ఆటంకాలు రానివ్వకు రామా....' అనుకుంటూ భద్రాచలం చేరుకున్నాను. రాముడ్ని దర్శించుకుని, తలనీలాలిచ్చి ఊరికి తిరిగొచ్చాను. ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం గండుగుల్ల పల్లే మా ఊరు. నా చిన్నప్పుడు మా ఊర్లో ఓ నలభై ఇళ్లకు మించి ఉండేవి కావు. గిరిజనులు, మేము కలిసే ఉండేవాళ్లం.

పాలు కొనేవారు కాదు... మా తాతకు వందల ఎకరాల భూమి ఉండేది. మా నాన్న(లక్ష్మయ్య) కూడా మంచి రైతే. పొలంతో పాటు వందల సంఖ్యలో పశువులు ఉండేవి. వరి, ఉలవలు, నువ్వులు, జొన్నలు, బొబ్బర్లు పండించేవారు. అప్పటికి వ్యవసాయ బోర్లు వంటి సౌకర్యాలు లేవు. దాదాపుగా అన్నీ మెట్ట పంటలే. వరి, కూరగాయల వంటివి పండించుకోవాలంటే మోట తోలించేవారు. ఊళ్లో మంచినీటికోసం ప్రత్యేకంగా బావులేమీ ఉండేవి కావు. అందరూ బిందెలు పట్టుకుని మోటాబావి దగ్గరకి వెళ్లి వరుసలో నిలబడేవారు. మా ఊరి నేల మంచిది. పంటలు బాగా పండేవి. ధాన్యాలన్నీ సంచుల్లోకి వచ్చే సమయానికి షావుకార్లు ఎడ్ల బండ్లు వేసుకుని వచ్చి ఊరి మధ్యలో కూర్చునేవారు. రైతులంతా తమ పంటల ఖరీదులు తెలుసుకుని సరుకంతా బేరం పెట్టి షాపుకార్లకు అమ్మేసేవారు. రైతులతో పనైపోయాక..షావుకార్లు ఇళ్ల దగ్గరికి వచ్చేవారు. అప్పుడు మా నాయనమ్మ నెయ్యిబిందె పట్టుకుని బయటకు వచ్చేది.

అప్పట్లో మహిళలకు బోలెడు సంపాదన ఉండేది. ఇంట్లో ఖర్చులకే కాదు బంగారం కొనుక్కోడానికి కూడా మగాళ్ల దగ్గర చెయ్యిచాపేవారు కాదు. కారణం పశువులు. మా ఇంట్లో గేదెలు, ఆవులు అన్నీ కలిపి వందకు పైగా ఉండేవి. పాలు ఎవరూ కొనేవారు కాదు. ఎందుకంటే అందరి ఇళ్లలో పాడి ఉండేది. కేవలం నెయ్యి మాత్రమే తయారుచేసేవారు. ప్రతి రెండు మూడు వారాలకు ఊళ్లో ఆడవాళ్లంతా షాపుకార్లకు నెయ్యి అమ్మేవారు.

బడిలేని గ్రామం...
మాది చాలా చిన్న గ్రామం. అంటే ఇళ్లు చాలా తక్కువగా ఉండేవని చెప్పా కదా. వ్యవసాయ భూములు చాలా ఉండేవి. అడవికి దగ్గరగా ఉండడం వల్ల గిరిజన జనాభా బాగా ఉండేవారు. ఊళ్లో ఎంత సంపద ఉన్నా...బడి అనే పదం మాత్రం వినిపించేది కాదు. దాదాపు 300 మంది జనాభా ఉన్న గ్రామం...అయినా ఒక పాఠశాల పెడితే బాగుండు అన్న ఆలోచన కూడా ఉండేది కాదు. నేను మా పెద్దమ్మగారి ఊర్లో నాలుగో తరగతి వరకూ చదువుకున్నాను. ఆ తరువాత సత్తుపల్లి, ఖమ్మం, హైదరాబాద్‌లలో నా చదువు కొనసాగింది. బీకామ్‌తో చదువు ఆపేసి రాజకీయాల్లోకి వచ్చాను. ఊళ్లో జనాభా పెరిగి రవాణా సౌకర్యం వచ్చాకే పాఠశాల వచ్చింది.

అడవి సంపద...
ఊరి జనమంతా ఏడాదికొకసారి ఏలూరు వెళ్లి సరుకులు కొనుక్కునేవారు. నాలుగే నాలుగు సరుకులు. టీ పొడి, మసాలా దినుసులు, బెల్లం బుట్ట, ఉప్పు కట్ట. అంతే. ఏడాదివరకూ దుకాణంతో పని ఉండేది కాదు. మిగిలినవన్నీ మాకు ఊళ్లో లేదా పక్కనే ఉన్న అడవిలో దొరికేవి. నూనె దగ్గర నుంచి పప్పుల వరకూ సమస్తం ఇంట్లో ఉండేవి. నాకు బాగా గుర్తు...నా చిన్నప్పుడు అడవికి వెళ్లి కూరలు తెమ్మనేవారు. బోడకాకరగాయలు, బుడం కాయలు, పుట్టకొక్కులు వంటి వన్నీ ఎక్కడ బడితే అక్కడ ఉండేవి. కోసి తెచ్చేవాళ్లం. ఇంటి ముందు నీడకోసం వేసుకునే పందిర్లనిండా ఆనపకాయలు, చిక్కుడు కాయలు, దొండకాయలు ఎప్పుడూ కాస్తూనే ఉండేవి. గిరిజనులైతే వారికి దొరికినవన్నీ తీసుకొచ్చి ఇస్తుండేవారు. మేమిచ్చినవి ఎంతో ఆనందంగా తీసుకునేవారు. మా ఇంట్లో సరుకులతో పాటు ధాన్యం, జొన్నలు మట్టిలో పాతర వేసి భద్రపరుచుకునేవాళ్లం. ఊళ్లో ఎవరికైనా అవసరం వస్తే లేదనకుండా వెంటనే ఇచ్చేవాళ్లం.

మా ఊళ్లో రాముడు... మా ఊళ్లో గుడి ఉండేది కాదు. కాని శ్రీరామనవమి వస్తే మాత్రం ఊరి మధ్యలో వేపచెట్టుకింద నాలుగు రాటలు పాతి, కొబ్బరాకులతో చిన్న పందిరి వేసి రాముని బొమ్మ పెట్టి పూజ చేసి ఊరివారందరికీ పానకం పోసేవారు. అంతకు మించి పెద్ద హడావిడి చేసేవారు కాదు. మేము పెద్దయ్యాక నాన్నే ముందుకు వచ్చి ఊరి ప్రజలతో మాట్లాడి ఊళ్లో రాముని గుడి కట్టించాడు. ఊరి ప్రజలు కూడా ఎవరికి తోచిన సాయం వారు చేశారు. అప్పుడు నేను పియుసి చదువుతున్నాను. రాములవారికి మొదటి కల్యాణం నాన్నే చేయించాడు. ఊరి ప్రజలందరికీ భోజనం పెట్టాడు. ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. మా ఊళ్లో రామ భక్తులు ఎక్కువ. అయితే వీళ్లెవరూ శ్రీరామనవమికి భద్రాచలం వెళ్లరు. ఆ సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిగతా రోజుల్లోనే వెళ్లి చక్కగా దర్శనం చేసుకుని పాపికొండలు వెళ్లి కాలక్షేపం చేసుకుని వస్తారు.

ఇప్పటికీ ఊళ్లోనే....
మా ఊళ్లో రామాలయం వచ్చాక భద్రాచలం వెళ్లడం బాగా తగ్గిపోయింది. చంద్రబాబుగారి హయాంలో నేను మంత్రి అయినపుడు నా ఊరొక్కటే కాదు మా జిల్లా రూపురేఖలన్నీ మారిపోయాయి. విద్య, వైద్యం, వ్యవసాయ శాఖల దగ్గరికెళ్లి మా జిల్లాకి కావాల్సిన పనులన్నీ చేయించుకునేవాడ్ని. ముఖ్యంగా మా ఊళ్లో రోడ్లు, పారిశుధ్యం, నీటి సౌకర్యం...అన్నీ బాగా అభివృద్ధి చెందాయి. నేను ఇప్పటికీ ఊళ్లోనే ఉంటున్నాను కాబట్టి ఏ చిన్న సమస్య ఉన్నా...నా దృష్టికి వస్తుంది. మిగతా జిల్లాలవారికి నేను రాజకీయ నాయకుడిగా తెలిసినా... మా ఊరి ప్రజలు మాత్రం నన్ను రైతుగానే చూస్తారు. చుట్టుపక్కల గిరిజనులైతే కనిపించగానే 'తుమ్మలన్నా...' అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు. నా పిల్లలంతా హైదారాబాద్‌లో, విదేశాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం ఊళ్లోని ఇంట్లో నేను, నా భార్య మాత్రమే ఉంటున్నాం. పొలాలు, పశువులు చూసుకుంటాం.  
'' ఊరి ప్రజల మధ్య హాయిగా గడచిపోతోంది జీవితం.'' 

ఆ రాముని ఆజ్ఞ...

నేను డిగ్రీ చదువుతున్న సమయంలో నాన్న చనిపోయారు. దాంతో డిగ్రీ పూర్తిచేసుకుని ఊరికి వచ్చేశాను. పలుగు పార పట్టుకోవడం తప్పలేదు. నాన్నలాగే మంచి రైతుని అనిపించుకోవడం కంటే మరో ప్రత్యామ్నాయం లేదు. తరువాత రాజకీయాల్లోకి వెళ్లాను. గ్రామ పంచాయితి నుంచి సమితి ఎన్నికల వరకూ యూత్ పాలిటిక్స్‌లో చాలా చురుగ్గా పాల్గొన్నాను. అదే సమయంలో ఎన్‌టిఆర్ తన పార్టీలో స్థానం కల్పించారు. సత్తుపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచాను. మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆ సమయంలో ఎన్టీఆర్‌గారు రామాలయం ధర్మకర్తల మండలిలో నన్ను సభ్యునిగా పెట్టారు. 'ఇప్పటివరకూ రాముని కళ్యాణం చేయాలంటే తిరుపతి వెంకటేశ్వరుని దగ్గర్నుంచి అప్పు తెస్తున్నారు.

భవిష్యత్తులో రాముడే మిగతా దేవాలయాలకు డబ్బులివ్వాలి. ఆ స్థాయికి ఈ దేవాలయాన్ని తీసికెళ్లాలంటే భక్తులొక్కరే సరిపోరు. దేశ విదేశాల నుంచి పర్యాటకులు కూడా భద్రాచలానికి రావాలి. దానికోసం నేను ఏమి చెయ్యడానికైనా సిద్ధమే. నువ్వు మాత్రమే చిత్తశుద్ధితో ఆ పని చేయగలవు' అని ఎన్టీఆర్‌గారు నాతో అన్న మాటల్ని నిజం చేయడానికి సిద్ధపడ్డాను. ఆలయం పక్కన కరకట్ట నిర్మాణం, స్టేడియం, కళ్యాణ మండపం, పార్కులు, పాపికొండల దగ్గర రామాయణ కథ చెప్పే శిల్పాలు, విశాలమైన రహదారులు...ఒకటేమిటి అన్ని పనులూ చేయించాం. ఆ మహత్కార్యంలో నన్నూ భాగస్వామిని చేసినందుకు ఆ శ్రీరాముడికి, మా రాముడికి(ఎన్టీఆర్)ఎప్పటికీ రుణపడి ఉంటాను.

No comments: